ఓయూ, వెలుగు: హబ్సిగూడ ప్రాంతంలోని ఓయూకు చెందిన స్థలంలో రెండ్రోజుల క్రితం కొందరు వ్యక్తులు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఏబీవీపీ స్టూడెంట్లు కూల్చివేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. వర్సిటీ భూముల కబ్జాకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వర్సిటీ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్సిటీ భూ అక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్లక్ష్మీనారాయణతో చర్చలు జరిపారు. ఓయూ భూముల ఆక్రమణను ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఔటా) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ మల్లేశం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొంత కాలంగా ఉస్మానియా యూనివర్సిటీ విలువైన భూములను ముఖ్యంగా స్ట్రీట్ నంబర్ 8 వైపు ఉన్న భూములను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
