బీజేపీ అసలు బుద్ధి బయటపడ్డది: నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి ఫస్ట్ రియాక్షన్

బీజేపీ అసలు బుద్ధి బయటపడ్డది: నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి ఫస్ట్ రియాక్షన్

న్యూఢిల్లీ: తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి స్పందించారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అధికార బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపడంతోనే ఈ కుట్ర మొదలైందని ఆరోపించారు. బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ వ్యవహారంతో బీజేపీ రాజనీతి ఏంటో అందరికీ అర్థమైందని.. ఈ నిర్ణయం ఆ పార్టీ ఉద్దేశాలను, విధానాలను బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఏక పార్టీ వ్యవస్థను తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను తారుమారు చేసినట్లే.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలను కూడా తారుమారు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

ఈ చర్య కేవలం ఒక రాజ్యసభ సీటు లేదా ఒక నిర్దిష్ట అభ్యర్థికి సంబంధించిన విషయం కాదని.. ఇది భారతదేశ భావన, ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న విస్తృత పోరాటానికి సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ చేస్తోన్న ఓట్ చోరీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని అన్నారు. 

►ALSO READ | పట్టపగలే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దోచుకునే చర్య: మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై కేసీ వేణుగోపాల్ ఫైర్

మీనాక్షి నామినేషన్ రిజెక్ట్

రాజ్య సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను నామినేషన్‎లో ఆమె వెల్లడించలేదని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.