న్యూఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తోన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. మీనాక్షి నటరాజన్ తన నామినేషన్లో ఏదైనా తప్పు లేదా వివరాలను వెల్లడించలేదనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవని పేర్కొన్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన స్థానాన్ని లాక్కోవడానికి చేసిన నిరాశాజనక ప్రయత్నం మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకునే బీజేపీ కుట్రలు విఫలమవుతున్నాయని గ్రహించి.. చివరకు చేసేదేమి లేక దిగజారిపోయి ఆమె నామినేషన్ను తిరస్కరించారని ఆరోపించారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఉన్న నిబద్ధత ఎంత బూటకమో మరోసారి నిరూపిస్తోందని అన్నారు.
►ALSO READ | తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్య సభ నామినేషన్ తిరస్కరణ
ప్రతి దశలోనూ బీజేపీ ఏదో ఒక రూపంలో ఓట్ల దోపిడీ చేయడానికే ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు దోచుకునే ఈ చర్యను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని తేల్చిచెప్పారు. దీనిపై న్యాయపరంగాను, రాజకీయంగాను, ప్రజల మధ్యనూ గట్టిగా పోరాడుతామని స్పష్టం చేశారు.
మీనాక్షి నామినేషన్ రిజెక్ట్
రాజ్య సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను నామినేషన్లో ఆమె వెల్లడించలేదని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది.
