షాపులుగా ఏసీ బస్సు షెల్టర్లు

షాపులుగా ఏసీ బస్సు షెల్టర్లు

ఖైరతాబాద్​, వెలుగు: సిటీలో ఏసీ బస్సుషెల్టర్లు షాపులుగా మారాయి.  వాటిలో  పాన్ షాపులు, జిరాక్స్​సెంటర్లు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏసీ బస్సు షెల్టర్లు నిర్మించారు.  నాలుగేళ్ల కిందట  ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద 6 ఏసీ బస్సుషెల్టర్లను బల్దియా ఏర్పాటు చేసింది. వాటిలో ఏసీలతో పాటు సీసీ కెమెరాలు, సెల్​ఫోన్ ​చార్జింగ్​పాయింట్ల సౌకర్యాలను కల్పించింది. 

రెండేళ్ల పాటు వాటి నిర్వహణ సజావుగా సాగింది. అనంతరం గాలికి వదిలేశారు. ప్రస్తుతం వాటిలోని ఏసీలు ఇప్పుడు లేవు.  సీసీ కెమెరాలు పని చేయడం లేదు. నాలుగు షెల్టర్లు ప్రయాణికులు వినియోగించుకుంటుండగా.. మిగతా 2 షెల్టర్లలో ఒకటి జిరాక్స్​షాపు, మరొకటి పాన్​షాపుగా మారాయి. ఆకతాయిలకు అడ్డాగా మారాయి.  బస్సులు నిలపాల్సిన చోట బైక్‌లు పార్కింగ్​చేస్తున్నారు.  దీంతో  ఒక్కో సమయంలో అక్కడ  డ్రైవర్లు బస్సులను నిలపకుండా డైరెక్టుగా వెళ్లిపోతున్నారు. 

పాన్‌​షాపు, జిరాక్స్​సెంటర్లకు వచ్చిన వారు అక్కడ బైక్‌లు నిలిపి  బస్సులు నిలిపేందుకు ఆటంకాలు కలిగిస్తున్నారు. అయితే ఆయా షాపులు అధికారికంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది  తెలియాల్సి ఉంది.