
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. ఏప్రిల్ లో ఏకంగా 21 కేసులు ఫైల్ చేసింది. ఇందులో 13 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రెండు క్రిమినల్ మిస్కండక్ట్ కేసులు, రెండు రెగ్యులర్ ఎంక్వైరీలు, రెండు ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీ డీజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 20 మంది అవినీతి అధికారులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపామని తెలిపింది.
ఏసీబీ అధికారుల ప్రకారం.. మొత్తం ట్రాప్ కేసుల్లో రూ.5 లక్షలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఈనెలలో రెండు నమోదుకాగా.. ఒక కేసులో రూ.3.51 లక్షలు, మరో కేసులో రూ.13.50 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. కాగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అలాగే, వాట్సాప్ నంబర్ 94404 46106 కూ కంప్లైంట్ చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు, బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.