
హనుమకొండ జిల్లాలో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం ( సెప్టెంబర్ 25 ) హనుమకొండ విద్యాశాఖాధికారి ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ తనిఖీల్లో రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్.
కొడకండ్లలో స్కూల్ బిల్డింగ్ మంజూరు కోసం రమేష్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు బాధితులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇవాళ హనుమకొండ డీఈఓ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ ను పట్టుకున్నారు అధికారులు.
రమేష్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని.. లంచం ఇచ్చి అవినీతిని ప్రోత్సహించొద్దని కోరుతున్నారు అధికారులు.