తెలంగాణలో ఏసీబీ వరుస దాడులతో హడలెత్తిస్తోంది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోంది. లంచానికి అలవాటు పడిన అధికారులు రోజుకో చోట ఏసీబీకి దొరికిపోతున్నారు లేటెస్ట్ గా పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కొరకు ఓ రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ఎండీ రసీద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికాలు.
పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు అనే రైతు నుంచి రూ. 35 వేల లంచం డిమాండ్ చేశాడు డాక్యుమెంట్ రైటర్ ఎండి రసీద్. బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ తో రైతు నుంచి లంచం తీసుకుంటున్న రిజిస్ట్రేషన్ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అదే కార్యాలయం విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
ఇవాళ (ఫిబ్రవరి 20) భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ రైడ్స్ నిర్వహించగా రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు కోర్టు సిబ్బంది. స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు న్యాయవాదిని లంచం డిమాండ్ చేశారు కోర్టు సిబ్బంది. దీంతో న్యాయవాది గోపాలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా కోర్టు సిబ్బందిని పట్టుకుంది ఏసీబీ.
