Mouni Roy: హద్దులు దాటిన ఫొటోగ్రాఫర్లు.. కారులోనూ వదల్లేదు.. చిర్రెత్తిపోయిన ‘విశ్వంభర’బ్యూటీ మౌనీ రాయ్

Mouni Roy: హద్దులు దాటిన ఫొటోగ్రాఫర్లు.. కారులోనూ వదల్లేదు.. చిర్రెత్తిపోయిన ‘విశ్వంభర’బ్యూటీ మౌనీ రాయ్

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నాగిని’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలబ్రెటీ పాపారాజీల (ఫొటోగ్రాఫర్ల) మౌనీ రాయ్ పై అత్యుత్సాహంపై ప్రదర్శించారు. ఈ క్రమంలోనే బ్యూటీ ఫొటోగ్రాఫర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దయచేసి ఇకపై నన్ను ఫొటోలు తీయకండి. నేను ఎప్పుడూ మిమ్మల్ని పిలవలేదు. ఇకపై కూడా నా కోసం రావద్దు. దయచేసి నన్ను ఫొటోలు తీయడం పూర్తిగా ఆపేయండి అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. అయినప్పటికీ స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అసలు ఏం జరిగింది?

ఇటీవల ముంబైలో తన స్నేహితురాలు, నటి అనుషా దండేకర్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మౌనీ రాయ్, డిన్నర్ అనంతరం బయటకు రాగానే పాపారాజీలు ఆమెను చుట్టుముట్టారు. కారులో కూర్చున్న తర్వాత కూడా కిటికీ అద్దాల గుండా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో అసౌకర్యానికి గురైన మౌనీ రాయ్ సహనం కోల్పోయి, ‘బంద్ కరో’ (కెమెరాలు ఆపండి) అంటూ వేలు చూపిస్తూ గట్టిగా హెచ్చరించారు. పరిస్థితిని గమనించిన అనుషా దండేకర్ మధ్యలో జోక్యం చేసుకుని మౌనీని శాంతింపజేసే ప్రయత్నం చేయడంతో పాటు, ఫొటోగ్రాఫర్లను కూడా కెమెరాలు ఆపాలని కోరారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో మౌనీ ఆవేదన

ఈ ఘటన అనంతరం మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పాపారాజీలకు విజ్ఞప్తి చేస్తూ.. ‘‘దయచేసి ఇకపై నన్ను ఫొటోలు తీయకండి. చాలా కాలంగా నేను మిమ్మల్ని ఎప్పుడూ పిలవలేదు. మీ అందరినీ గౌరవిస్తాను, ప్రేమిస్తాను. కానీ మిమ్మల్ని నేను పిలవను. కాబట్టి నా కోసం రావద్దు. ఎప్పుడైనా నా ఫొటోలు బయట కనిపిస్తే, వాటికి నేను పిలిచానని అనుకోకండి. దయచేసి ఇకపై నన్ను ఫొటోలు తీయడం పూర్తిగా ఆపేయండి. ప్లీజ్... ఇక మళ్లీ కాదు. మీ అందరికీ నా ప్రేమ, గౌరవం’’అని తెలిపింది.

అయితే, ఈ స్టోరీని కొద్దిసేపటికే మౌనీ రాయ్ తొలగించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మౌనీ స్పందనను విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, కారులోకి వెళ్లిన తర్వాత కూడా చిత్రీకరించడం హద్దులు దాటడమేనని ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

సినిమాల విషయానికి వస్తే..

మౌనీ రాయ్ ఇటీవల ‘అబ్ హోగా హిసాబ్’ వెబ్ సిరీస్‌లో సంజయ్ కపూర్, షహీర్ షేక్, నిమ్రత్ కౌర్ అహ్లువాలియా, అవినాష్ మిశ్రాలతో కలిసి నటించారు. త్వరలో మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తున్న 'ది వైవ్స్' చిత్రంలో కనిపించనున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తుండగా, ముఖ్యంగా చిరుతో స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనుంది మౌని రాయ్.