మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఆయన ఆస్తులపై సోదాలు చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలతో పాటు ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. గతంలో పనిచేసిన పాపారావుకి ప్రధాన శిష్యుడుగా ఉన్నారు కిషన్ నాయక్. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా కిషన్ నాయక్ 2024 డిసెంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. పైసలిస్తే గానీ పనులు జరగడం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులో రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఇటీవలే ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ దాడులు చేసింది. ఏసీబీ డీఎస్పీ ఏకాంబరం రమేశ్ ఆధ్వర్యంలో టీమ్ మధ్యాహ్నం నుంచి సోదాలు చేపట్టింది. అర్ధరాత్రి దాకా కొనసాగించింది. తనిఖీల్లో వెహికల్, డ్రైవింగ్ లైసెన్స్ లను ఏజెంట్ల వద్ద గుర్తించింది. ఏజెంట్ల నుంచి వచ్చే ప్రతి ఫైల్ కు ఒక స్పెషల్ కోడ్ ఉండడం చూసి ఏసీబీ ఆఫీసర్లు నివ్వెరపోయారు.
