
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తూ పట్టుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసినా కొందరి తీరు మారటం లేదు. లంచం డిమాండ్ చేస్తూ సామాన్యులను వేధిస్తూనే ఉన్నారు. దాడులు చేస్తున్నది మా ఆఫీస్ పైన కాదు కదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
శుక్రవారం (జులై 18) మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారి కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడి చేశారు. లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఓ మహిళ నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
అంతకు ముందు గురువారం (జులై 17) రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపుదాడులు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, మెదక్ జిల్లా సదాశివపేట్, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎస్ఆర్వో కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు ఏసీబీ డీజీ విజయ్కుమార్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
బీబీనగర్ ఎస్ఆర్వో కార్యాలయంలో తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.61,430 స్వాధీనం చేసుకోవడంతో పాటు కార్యాలయ ఆవరణలో 12 మంది అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తులను గుర్తించి 93 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జడ్జర్ల ఎస్ఆర్వోలో రూ.30,900 నగదు, 20 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని11 మంది అనధికారిక వ్యక్తులను గుర్తించినట్టు తెలిపారు.
సదాశివపేట్ ఎస్ఆర్వోలో రూ.5,500 లెక్కల్లో చూపని డబ్బుతో పాటు 9 మంది ప్రైవేటు వ్యక్తులను గుర్తించారు. 39 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్ని కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. అన్ని అకవతవకలపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు ఏసీబీ డీజీ విజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల జిల్లాలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పట్టుబడటం గమనార్హం.