సుశాంత్‌ సూసైడ్‌ కేసు: సీబీఐ విచారణకు ఓకే చెప్పిన కేంద్రం

సుశాంత్‌ సూసైడ్‌ కేసు: సీబీఐ విచారణకు ఓకే చెప్పిన కేంద్రం
  • సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ సూసైడ్‌ కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని బీహార్‌‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్తున్నట్లు సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌‌ జనరల్‌ తుషార్‌‌ మెహతా ఈ విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌ను కూడా కోర్టుకు అందించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తండ్రి బీహార్‌‌లో కేసు పెట్టగా.. దాన్ని ముంబైకి అప్పగించాలని కోరుతూ రియా పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ యాక్టర్‌‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ నేపథ్యంలో దానిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.15 కోట్లు రియా ట్రాన్స్‌వర్‌‌ చేసుకుందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీహార్‌‌ ప్రభుత్వాన్ని కోరగా.. నితీశ్‌ కుమార్‌‌ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి ప్రతిపాదించారు.