పెళ్లికి వెళ్లి.. తిరిగొస్తుండగా యాక్సిడెంట్

పెళ్లికి వెళ్లి.. తిరిగొస్తుండగా యాక్సిడెంట్

హైదరాబాద్‌, వెలుగు: పెండ్లికి వెళ్లొస్తుండగా ఓఆర్ఆర్​ సమీపంలో కారు యాక్సిడెంట్​కు గురై ముగ్గురు స్పాట్​లోనే చనిపోయారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. మేడ్చల్​ జిల్లా కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్​కు చెందిన కె.బాలకృష్ణమూర్తి(48), రేణుక(42) భార్యా భర్తలు. వీరి కొడుకు భాస్కర్. హైదరాబాద్‌ సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ భార్య శంకరమ్మ(48). శంకరమ్మ బాలకృష్ణమూర్తికి వరుసకు అత్తయ్య. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలో ఆదివారం జరిగిన పెండ్లికి బాలకృష్ణమూర్తి, రేణుక, భాస్కర్, శంకరమ్మ హాజరయ్యారు. అదేరోజు రాత్రి తిరిగి కారులో మేడ్చల్​ బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ కీసర ఎగ్జిట్ పాయింట్‌ నుంచి కండ్లకోయ వైపు వెళ్తుండగా యాదగిర్​పల్లి వద్ద ఓ లారీని తప్పించబోయి వీరి కారు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న బాలకృష్ణమూర్తి, వెనుక సీట్లో కూర్చున్న రేణుక, శంకరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ముందు లెఫ్ట్​సైడ్​సీట్లో కూర్చున్న భాస్కర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో ఏసీపీ ప్రసాద్‌ ఇంట్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌ సీపీ అంజనీ​కుమార్‌‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, సీసీఎస్ సిబ్బంది ఏసీపీని పరామర్శించారు.