- రాబోయే ఐదు రోజులు హై టెంపరేచర్లు: వాతావరణ శాఖ
- రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
- ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాడ్పుల వార్నింగ్..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. వడగాడ్పుల ప్రభావం కూడా ఎక్కువ కానున్నది. ఈ మేరకు ఆదివారం వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాడ్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని తెలిపింది. మరోవైపు ఆయా జిల్లాలతోపాటు మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదమున్నదని తెలిపింది.
పెరుగుతున్న ఫారెస్ట్ ఫైర్స్
ఎండల ప్రభావంతో రాష్ట్రంలోనూ కార్చిచ్చు ఘటనలు పెరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి ఏజెన్సీ ఏరియాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నట్టు నాసా ఫైర్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ మ్యాప్స్ స్పష్టం చేస్తున్నది. మూడు రోజులుగా 82 కార్చిచ్చు ఘటనలు జరగ్గా.. అందులో 5 పెద్ద ఘటనలున్నట్టు నాసా ఫైర్ మ్యాప్స్ వెల్లడించింది. దేశంలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడో ప్లేస్లో ఉన్నట్టు తేలింది. టెంపరేచర్లు ఇప్పటికే 43 డిగ్రీల మార్క్ను దాటిన నేపథ్యంలో.. మున్ముందు టెంపరేచర్ల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ ఫైర్స్ ఘటనలు కూడా పెరిగే ఆస్కారముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పలు జిల్లాల్లో కొంచెం తగ్గిన టెంపరేచర్స్
ఆదివారం పలు జిల్లాల్లో టెంపరేచర్లు కొద్దిగా తగ్గాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులపాటు 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదు కాగా.. ఆదివారం 42 డిగ్రీల వరకు రికార్డ్ అయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, నిర్మల్ లో 42.3, వనపర్తిలో 42.2, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 41.8, కామారెడ్డి, నాగర్కర్నూల్ లో 41.7, మహబూబ్నగర్, రాజన్న సిరిసిల్లలో 41.4, భద్రాద్రి కొత్తగూడెం 41.3, సూర్యాపేటలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 39 నుంచి 41 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డు అయ్యాయి.