
ఎల్బీనగర్, వెలుగు: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు మేనత్తను సిమెంట్ ఇటుకతో కొట్టి చంపిన ఘటనలో రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. పోలీసులు, పీపీ తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం లక్ష్మమ్మగూడేనికి చెందిన మాధగోని రాజు(30) రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ లోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
కరోనా సమయంలో మేనత్త జంగమ్మ(54) దగ్గర రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకుండా అత్తను ఇబ్బంది పెట్టాడు. ఇదే ఏడాది ఫిబ్రవరి 17న ఇంజాపూర్ లోని జంగమ్మ ఇంటి వద్ద రాజు కనిపించగా ఇవ్వాల్సిన డబ్బుల గురించి గొడవ పెట్టుకుంది. దీంతో కోపోద్రికుడైన రాజు జంగమ్మను సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని సాక్షాధారాలు ఫాస్ట్రాక్ కోర్టులో దాఖలు చేశారు. విచారించిన కోర్టు గురువారం రాజుకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.