- ఏప్రిల్ 1 తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతం: మోదీ
- రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్కు చురక
- స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
న్యూఢిల్లీ : కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఏప్రిల్ 1 తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో బుధవారం నిర్వహించిన ‘స్టార్టప్ మహాకుంభ్’లో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేస్తూ ఉండాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చురకలంటించారు. ‘స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ప్రయోగాత్మకమైనది. ఏదైనా కారణంతో ఒక స్టార్టప్ను ప్రారంభించడంలో విఫలమైతే మరోదానికి వెళ్లాల్సిందే. కానీ రాజకీయాల్లో అలా కాదు.. కొందరిని రిపీటెడ్గా లాంచ్ చేయాల్సిందే’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.
పుతిన్కు మోదీ శుభాకాంక్షలు
రష్యా ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బుధవారం పుతిన్కు ఫోన్ చేసిన మోదీ.. రష్యా–ఉక్రెయిన్ వివాదం పరిష్కారానికి చర్చలు, దౌత్యమే మార్గమని సూచించారు. ‘ఈ రోజు పుతిన్తో ఫోన్లో మాట్లాడాను. రష్యన్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు
అభినందనలు తెలిపాను. భారత్, రష్యా మధ్య ఉన్న ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించేందుకు ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం’ అని మోదీ ఎక్స్లో వ్యాఖ్యానించారు. అలాగే, భారత్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను మోదీ విజయవంతంగా నిర్వహించాలని పుతిన్ ఆకాంక్షించినట్టు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఫోన్ సంభాషణలో మోదీ, పుతిన్ కలిసి ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించారని, ప్రాంతీ య, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.