
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి సంస్థలో పని చేస్తూ ఎక్కువగా గైర్హాజరవుతున్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కంపెనీ సీఎండీఎన్. బలరాం హెచ్చరించారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ఆఫీస్లో పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్లతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించి పలు అంశాలపై రివ్యూ చేశారు. ఎక్కువగా గైర్హాజరుఅవుతున్న ఉద్యోగుల కారణంగా వారి కుటుంబాలతో పాటు సంస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని చెప్పారు.
కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఫైల్స్ పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్మికుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ నియామకాలు, సీఎంపీఎఫ్, పెన్షన్, గ్రాట్యూటీ చెల్లింపులు, క్వార్టర్స్ నిర్మాణాలు, ప్రమోషన్స్పై చర్చించారు. సమావేశంలో డైరెక్టర్(పా) కె. వెంకటేశ్వర్లు, సీపీపీ జీఎం ఎ.మనోహర్, జీఎంలు కవితానాయుడు, బెర్నడెట్ నికోలస్, జీవీ కిరణ్ కుమార్, ఏజీఎం మురళీధర్ పాల్గొన్నారు.