ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేపై తిరగబడ్డ కార్యకర్తలు

ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేపై తిరగబడ్డ కార్యకర్తలు
  • అలంపూర్​ ఎమ్మెల్యే అబ్రహంపై లీడర్ల ఫైర్​
  •     నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలంటూ నిలదీత
  •     మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శ
  •     మధ్యలోనే వెళ్లిపోయిన మాజీ ఎంపీ జగన్నాథం

మానవపాడు, వెలుగు : గద్వాల జిల్లా ఆలంపూర్​నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అబ్రహంపై  సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడ్డారు. ఎమ్మెల్యే తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.నియోజకవర్గంతో పాటు మానవపాడు మండలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ నిలదీశారు. మంగళవారం మానవపాడు మండలంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేయగా పార్టీ ఇన్​చార్జి రవీందర్, ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి, మాజీ ఇన్​చార్జి మంద శ్రీనాథ్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా అలంపూర్​జోగులాంబ ఆలయ కమిటీ మాజీ చైర్మన్​జల్లాపూర్​వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ పదవి పొందిన చల్లా వెంకట్రాంరెడ్డి, ఆయన వర్గం ఎక్కడుందన్నారు. ఆత్మీయ సమ్మేళనం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. 

నువ్వు ఏం చేశావో చెప్పు 

మానవపాడు మండలంలోని ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని సీనియర్​నాయకుడు పల్లెపాడు శంకర్ రెడ్డి ఎమ్మెల్యేను నిలదీశారు. కార్యకర్తలకు తెలియకుండా గ్రామాలకు వస్తుండడంతో వారంతా అయోమయంలో ఉన్నారని  మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు శంకర్​రెడ్డిపైకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే, శంకర్​రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీ చైర్మన్ సరిత జోక్యం చేసుకుని కూర్చొని మాట్లాడుకోవాలని సర్ది చెప్పారు.

అంతకుముందు మండల సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనం స్టేజీపై కూర్చున్నవారు కుళ్లు, కుతంత్రాలు ఉన్నవారని, కింద కూర్చున్నవారే నిజమైన కార్యకర్తలని, వారే పార్టీ కోసం పని చేస్తున్నారన్నారు. ఎస్సీ కాలనీలకు కరెంటు కట్​చేస్తున్నారని, ఈ విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. 

అలిగి వెళ్లిన మంద జగన్నాథం

తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, జోగులాంబ హాల్ట్, జూరాల లింకు కెనాల్ ప్రాజెక్టులను తానే తెచ్చానని మాజీ ఎంపీ మంద జగన్నాథం అన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్ద అయినంత మాత్రాన, తన సొంత గ్రామానికి వచ్చినా తనకు పిలుపు లేదని, ఇలాగే చేస్తే  కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఆయన మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్తలను భోజనాలకు పంపడంతో మనస్తాపానికి గురైన  జగన్నాథం అలిగి వెళ్లిపోయారు. 

గెస్ట్ హౌస్​లోనూ మాటల వార్​

ఆత్మీయ సమ్మేళనం జరగడానికి ముందే గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే అబ్రహం, పల్లెపాడు శంకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. సీనియర్ నాయకులు కలగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా ఎమ్మెల్యే కొడుకు అజయ్ అక్కడికి వచ్చారు. శంకర్​రెడ్డిని ‘ ఇలాంటి టైంలో ప్రశ్నించాల్సిన అవసరం ఏం ఉంది. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం’ అని అన్నారు. కార్యకర్తలు, నాయకులు జోక్యం చేసుకుని వారిని మీటింగ్ కు తీసుకువచ్చారు.