తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దీనిపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు’ అని ట్వీట్ చేశారు.
తిరుమల శ్రీవారి విలువైన ఆభరణాలలో ఒకటైన పింక్ డైమండ్ మాయమైందంటూ రెండేళ్ల క్రితం నాటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఆ ఘటన అప్పట్లో రాజకీయ దుమారానికి కారణమైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ వ్యాఖ్యలు చేసిన రమణ దీక్షితులును నాటి ప్రభుత్వం తొలగిస్తూ టీటీడీ ప్రధాన అర్చకుల వయో పరిమితిని మార్చింది. దీంతో ఆయన నాడు ఈ విషయంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ద్వారా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఇటీవలే శ్రీవారి భూములను విక్రయించబోతున్నారంటూ వివాదం రేగడంతో.. ఆ తీర్మానం గత తెలుగు దేశం ప్రభుత్వం హయాంలోనే చేశారంటూ దానిని నిలిపేస్తూ జగన్ సర్కారు జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన నాగబాబు.. ఏపీ సీఎం జగన్ కు అభినందనలు చెబుతూ.. గతంలో సంచలనమైన పింక్ డైమండ్ గురించి ఎంక్వైరీ చేయించాలని కోరారు.