నటుడు సోనూసూద్ను భారత ఎన్నికల సంఘం పంజాబ్ రాష్ట్రానకి ఐకాన్గా నియమించింది. సోనూసూద్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఆయనను పంజాబ్ ఐకాన్గా నియమించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపినట్లు పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు తెలిపారు. ఆ ప్రతిపాదనను ఎన్నికల సంఘం ఆమోదించడంతో.. సోనూసూద్ను ఐకాన్గా నియమిస్తున్నట్లు రాష్ట్ర సీఈఓ కరుణరాజు ప్రకటించారు.
పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన సోనూసూద్.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో వలసకూలీలు వారివారి ఇళ్లకు చేరుకోవడంలో ఎంతగానో సాయం చేశారు. దాంతో ఆయనకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. దేశంలో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వలస కూలీలకు సోనూసూద్ వివిధరకాలుగా ప్రయాణ ఏర్పాట్లు చేశారు. ఆయన మానవతా గుణాన్ని మెచ్చి దేశవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు దక్కాయి.
తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవంపై సోనూసూద్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘ఈ గౌరవానికి నేను చాలా కృతజ్ఞుడను. పంజాబ్లో జన్మించిన నాకు ఈ నియామకం ఎంతో భావోద్వేగంగా ఉంది. నా రాష్ట్రం నా గురించి గర్వించటం చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవంతో నేను మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించబడ్డాను’ అని సోను అన్నారు.