కరోనా సమయంలో సాయం చేస్తూ హెల్పింగ్ స్టార్ గా మారిపోయిన సోనూసూద్ ఎంతో మందికి సేవలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా బారినపడి ఎంతో మంది చనిపోతుండటంతో ఏమీ చేయలేక పోయానంటూ సోమవారం ట్వీట్ చేశాడు. ఇటీవల ఓ కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదలడంతో ట్విటర్ వేదికగా సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మనం కాపాడాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిని కోల్పోవడం సొంత వాళ్లను కోల్పోవడం కంటే తక్కువేం కాదు. తనను రక్షిస్తామని మాట ఇచ్చిన కుటుంబాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ రోజు నేను కొంతమందిని కోల్పోయాను. వాళ్లు నాకు రోజుకు కనీసం 10 సార్లు ఫోన్ చేసేవారు ఇక ఎప్పటికీ కాల్ చేయరు. నేను నిస్సహాయుడిగా మారిపోయాను అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు సోనూసూద్.
లాక్ డౌన్ కాలంలో ఎంతోమంది కార్మికులను తన సొంత ఖర్చులతో వారి సొంతిళ్లకు పంపి అందరి హృదయాలను గెలుచుకున్న సోనూ.. ఇపుడు సెకండ్ వేవ్ తో ఇబ్బంది పడుతున్న వారిని కూడా ఆదుకుంటున్నాడు. ఇటీవల సోనూసూద్ ఏపీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.