
సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్గా నటించగా, బాబీడియోల్ విలన్ పాత్ర పోషించాడు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్లో మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
సూర్య మాట్లాడుతూ ‘రెండేళ్లుగా మూడు వేల మందికి పైగా ఈ చిత్రం కోసం వర్క్ చేశాం. దానికి సపోర్ట్ చేసిన నా వైఫ్ జ్యోతికతో పాటు మా టీమ్లోని జీవిత భాగస్వాములందరికీ థ్యాంక్స్. ఈ సినిమా డబ్బు కోసం చేసింది కాదు.. అందరికీ ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం. అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా’ అని అన్నాడు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ ‘ప్రతి దర్శకుడికి ఒక ఎపిక్ మూవీ చేయాలని ఉంటుంది. నాకు అలాంటి అవకాశం ‘కంగువ’తో దొరికింది’ అని చెప్పాడు. రాజమౌళి గారి స్ఫూర్తితోనే ఇలాంటి హ్యూజ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేశామని నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్నారు. రైటర్ రాకేందు మౌళి, నటుడు అవినాష్ తదితరులు పాల్గొన్నారు.