
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేకు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని మేడమ్ టుస్పాడ్ లో దీపిక మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గురువారం రణ్ వీర్, దీపిక పదుకునే ఆవిష్కరించారు. దీపికా మైనపు విగ్రహాన్ని చూసి దీప్ వీర్ జంట ఆశ్చర్యపోయింది. దీపికా.. మైనపు విగ్రహాన్ని చూడగానే.. రణ్ వీర్ సింగ్ ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చా అంటూ జోక్ చేశారు. దీంతో అక్కడున్నవారు కాసేపు నవ్వుకున్నారు. వెంటనే దీపికా.. రణ్వీర్ ను ఉద్దేశిస్తూ.. నువ్వు షూటింగ్ లో ఉన్నప్పుడు నన్ను మిస్సయ్యావని అనిపిస్తే.. ఇక్కడకు వచ్చి నా మైనపు విగ్రహాన్ని చూడు.. అంటూ బదులిచ్చింది. దీప్ వీర్ మేడమ్ టుస్సాడ్స్ లో సందడి చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
IIFA 2016 అవార్డ్స్ లో దీపిక పాల్గొన్నప్పటి లుక్ తోనే ఆమె మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. అప్పుడు సవ్యసాచి డిజైన్ చేసిన డ్రెస్ వేసుకొని రెడ్ కార్పెట్ పై హొయలు పలికింది దీపిక. గత సంవత్సరం జులైలో దీపికా.. మేడమ్ టుస్సాడ్స్ టీమ్ ను కలిసి తన కొలతలు ఇచ్చింది. గురువారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. మేడమ్ టుస్సాడ్స్ లో ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీపికా సినిమాల విషయానికి వస్తే.. దీపికా చివరగా నటించిన సినిమా పద్మావత్. ప్రస్తుతం చపాక్ అనే సినిమాలో దీపికా నటిస్తోంది.