సైబర్ క్రైం పోలీసులకు నటి హేమ ఫిర్యాదు

సైబర్ క్రైం పోలీసులకు నటి హేమ ఫిర్యాదు

టాలీవుడ్ నటి హేమ యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న ఫొటోలకు.. ఫేక్ తంబ్ నైల్స్ పెట్టి.. అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. 2023, మార్చి 21వ తేదీ ఈ మేరకు పోలీసులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. సెలెబ్రిటీ లను టార్గెట్ చేస్తూ.. అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు చనిపోయారని యూ ట్యూబ్ ఛానళ్లు దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో తరచుగా నాపై, నా కుటుంబంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని.. కావాలనే నన్న టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు నటి హేమ. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్లు ఇష్టమొచ్చినట్లు రాస్తూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. గతంలోనూ నాపై తప్పుడు కథనాలు రాశారని.. ఏమీ లేకుండా వార్తలు రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె.

నటి హేమ రీసెంట్ గా తన  వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందులో భాగంగా భర్త సయ్యద్ జాన్ అహ్మద్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి కేక్ కట్ చేశారు.  స్విమ్మింగ్ పూల్‌లో కోక్ కట్ చేసే సమయంలో భర్త అహ్మద్‌కు హేమ లిప్ లాక్ ఇచ్చారు. ఈ వీడియోను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో అభ్యంతరకర తంబ్‌ నైల్స్‌ పెట్టి ప్రచారం చేశారు. దీంతో ఆగ్రహించిన హేమ..అలాంటి ఛానెల్స్‌పై  ఫిర్యాదు చేశారు.