![అదానీ భారీ ఐపీఓ..ఈ నెలాఖరులోనే ఉండే ఛాన్స్?](https://static.v6velugu.com/uploads/2023/01/addani_q4wZI9nbLN.jpg)
ముంబై: అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ తన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) కోసం స్టాక్ ఎక్స్చేంజీల వద్ద పేపర్లు ఫైల్ చేసింది. ఈ ఫాలో ఆన్ ఐపీఓ ద్వారా రూ. 20 వేల కోట్లను సమీకరించాలనేది అదానీ ఎంటర్ప్రైజస్ ప్లాన్. జనవరి చివరి వారంలో ఫాలో ఆన్ ఐపీఓ చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కానీ, అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి మాత్రం స్పందించలేదు. ఫాలోఆన్ ఐపీఓకి రానున్నట్లు కిందటి ఏడాది నవంబర్లోనే అదానీ గ్రూప్ ప్రకటించింది. పార్ట్లీ పెయిడ్అప్ షేర్ల జారీ ద్వారా ఫండ్స్ను అదానీ ఎంటర్ప్రైజస్ సేకరించొచ్చని కొంత మంది బ్యాంకర్లు చెప్పారు. ఫాలో ఆన్ ఐపీఓలో రిటెయిల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో చూస్తే అదానీ ఎంటర్ప్రైజస్ షేరు 94 శాతం ర్యాలీ చేసింది. ఇక అయిదేళ్ల కాలానికి చూస్తే ఏకంగా 1,760 శాతం లాభపడింది.
తగ్గనున్న ప్రమోటర్ల వాటా..
ఫాలో ఆన్ ఐపీఓ కోసం మర్చంట్ బ్యాంకర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, ఎలారా క్యాపిటల్లను అదానీ ఎంటర్ప్రైజస్ నియమించుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ పూర్తయితే అదానీ ఎంటర్ప్రైజస్లో గౌతమ్ అదానీ సహా ప్రమోటర్ల వాటా 3.5 శాతం తగ్గుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉంది. మిగిలిన 27.37 శాతం వాటాలు పబ్లిక్ చేతిలో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజస్లో ఎల్ఐసీ కి 4.03 శాతం, నోమురా సింగపూర్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి కంపెనీలకు 1 నుంచి 2 శాతం దాకా వాటాలు ఉన్నాయి. ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ, ఇతర సావరిన్ వెల్త్ ఫండ్స్ పెద్ద బయ్యర్లుగా ఉండొచ్చని సమాచారం.
అప్పులు తగ్గించుకునే వీలు..
అదానీ ఎంటర్ప్రైజస్ అప్పులను తగ్గించుకోవడానికి ఫాలో ఆన్ ఐపీఓ వీలు కల్పించనుంది. గత కొంత కాలంగా అదానీ గ్రూప్ వివిధ రంగాలలో భారీ విస్తరణ ప్రాజెక్టులు ప్రకటించింది. కొన్ని పెద్ద కంపెనీలను కొనేయడంతోపాటు, మరికొన్ని కొత్త ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారీగా అప్పులు తీసుకుంది. గ్రూప్ అప్పులు రూ. 2. 2 లక్షల కోట్ల దాకా ఉండొచ్చు. దీంతో మార్కెట్లో కొంత మంది ఎనలిస్టులు గ్రూప్పై సందేహాలు కూడా వ్యక్తం చేశారు. అయితే, ఈ సందేహాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ తోసిపుచ్చారు. గ్రూప్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని చెబుతూ, అప్పుల పెరుగుదల రేటుతో పోలిస్తే లాభాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఫాలో ఆన్ ఐపీఓ ద్వారా ఫండ్స్ సేకరించాలనుకునే లిస్టెడ్ కంపెనీలు కొన్ని సెబీ రూల్స్ను పాటించడం ద్వారా ప్రాసెస్ను వేగం చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలు ఒకటి లేదా ఎక్కువ స్టాక్ ఎక్స్చేంజీలకు తాజా షేర్ల లిస్టింగ్కు ఇన్ప్రిన్సిపుల్ అప్రూవల్ కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు చూస్తే గతంలో 2011 లో టాటా స్టీల్ ఇలాగా ఫాలో ఆన్ ఐపీఓకి వచ్చింది. అప్పట్లో ఇలా ఫాస్ట్ట్రాక్ రూట్లో రూ. 3,500 కోట్లను టాటా స్టీల్ సమకూర్చుకుంది.