న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను ఎంక్వైరీ చేసేందుకు అదనంగా టైమ్ అవసరం లేదని సుప్రీం కోర్ట్కు సెబీ పేర్కొంది. హిండెన్బర్గ్ రిపోర్ట్పై దర్యాప్తు పూర్తి కావస్తోందని, ఇప్పటికే 24 కేసుల్లో 22 పరిష్కరించామని వెల్లడించింది. అదానీ– హిండెన్బర్గ్ ఇష్యూపై శుక్రవారం సుప్రీం కోర్ట్లో హియరింగ్ పూర్తయ్యింది. తీర్పు రావాల్సి ఉంది. మొత్తం 24 కేసులపై దర్యాప్తు పూర్తి కావాలని డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్ట్ 25 న కీలకమైన స్టేటస్ రిపోర్ట్ను సుప్రీం కోర్టుకు సెబీ సబ్మిట్ చేసింది. ‘సెబీ మొత్తం 24 కేసులపై దర్యాప్తు జరపాలి. హిండెన్బర్గ్ రిపోర్ట్ నిజమని మేము అనడం లేదు. కానీ, అదానీ గ్రూప్పై ఆరోపణలు నిజమా? కాదా? తెలుసుకునేందుకు మార్గాలేమి లేవు. అందుకే దర్యాప్తు చేయాలని సెబీని అడిగాం’ అని సుప్రీం కోర్ట్ బెంచ్ వెల్లడించింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో వినోద్ అదానీకి చెందిన ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాయని తెలియజేసే డాక్యుమెంట్లు న్యూస్ పేపర్లలో వచ్చాయి, కానీ సెబీ ఎందుకు కనుక్కోలేకపోయిందని పిటిషనర్లు కోర్టులో వాదించారు. సిట్ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్ట్ను కోరారు.
దర్యాప్తు చేశామని, కానీ రిపోర్ట్ను బయట పెట్టలేదని సెబీ వెల్లడించింది. కాగా, ఇచ్చిన టైమ్లోపు దర్యాప్తును సెబీ పూర్తి చేయలేకపోయిందని, ఇది కోర్టును ధిక్కరించినట్టేనని గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది. అదానీ గ్రూప్ షేర్లను మానిప్యులేట్ చేసిందని, కంపెనీల్లో అకౌంటింగ్ మోసాలు జరిగాయని యూఎస్ కంపెనీ హిండెన్ బర్గ్ ఈ ఏడాది జనవరిలో ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఆ తర్వాత ఈ గ్రూప్ కంపెనీల షేర్లు 70 శాతం వరకు పడ్డాయి. ఈ ఇష్యూపై దర్యాప్తు జరపాలని సెబీని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్ట్ 14 తోనే డెడ్లైన్ ముగిసింది. ఆ తర్వాత డెడ్లైన్ పొడిగించారు.