
హైదరాబాద్, వెలుగు: కృష్ణపట్నం పోర్టులోని 100 శాతం వాటాను అదానీ పోర్ట్స్ దక్కించుకుంది. ఈ పోర్టులో ఇప్పటికే 75 శాతం వాటాను సొంతం చేసుకున్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీసెజ్), మిగిలిన 25 శాతం వాటాను విశ్వ సముద్ర హోల్డింగ్స్ నుంచి కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 2,800 కోట్లు. ఈ పోర్టు కెపాసిటీ ఏడాదికి 64 మిలియన్ టన్నులుగా ఉంది. 2025 నాటికి ఏపీసెజ్ కెపాసిటీని ఏడాదికి 500 మిలియన్ టన్నులకు పెంచాలని కంపెనీ చూస్తోంది. ఈ టార్గెట్ను చేరుకోవడంలో కృష్ణపట్నం పోర్టు సాయపడుతుందని అదానీ పోర్ట్స్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2020–21 లో కృష్ణపట్నం పోర్టు రెవెన్యూ రూ. 1,840 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రాలో గంగవరం, కృష్ణపట్నం, గుజరాత్లో ముంద్రా, దహేజ్, తునా, హజిరా, ఒడిశాలో దామ్రా, గోవాలో మార్మగోవా, మహారాష్ట్రలో డిఘి, తమిళనాడులో కట్టుపల్లి, ఎన్నూర్ పోర్టులను అదానీ పోర్ట్స్ ఆపరేట్ చేస్తోంది.