ఫ్లాట్‌‌గా అదానీ పోర్ట్స్​ లాభం

ఫ్లాట్‌‌గా అదానీ పోర్ట్స్​ లాభం

న్యూఢిల్లీ :  అదానీ పోర్ట్స్​ అండ్​ స్పెషల్​ ఎకనమిక్​ జోన్స్​ లాభం సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో 1.37 శాతం పెరిగి రూ. 1,761.63 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో కంపెనీ లాభం రూ. 1,737.81 కోట్లు.  జులై– సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో ఆదాయం రూ. 6,951.86 కోట్లకు పెరిగినట్లు కంపెనీ బీఎస్​ఈ ఫైలింగ్​లో తెలిపింది. ఏడాది ప్రాతిపదికన ఇబిటా 49 శాతం పెరిగిందని పేర్కొంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రూ. 12,894 కోట్ల రెవెన్యూ సాధించిన కంపెనీ మరో మైలురాయిని దాటిందని అదానీ పోర్ట్స్​ సీఈఓ కరణ్​ అదానీ చెప్పారు.

ఇక ఇబిటా రూ. 7,429 కోట్లకు ఎగసిందని, కార్గో వాల్యూమ్స్​ కూడా 203 మిలియన్​ మెట్రిక్ ​ టన్నులకు చేరాయని పేర్కొన్నారు. ముంద్రా పోర్టు 25 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఒకే నెలలో 16 మిలియన్​ మెట్రిక్​ టన్నుల కార్గో హ్యాండిల్​ చేసిన ఘనతను ఈ పోర్టు దక్కించుకుందని వెల్లడించారు.  దేశంలో ఏదైనా ఒక పోర్టు ఇంత కార్గో హ్యాండిల్​ చేయడం ఇదే మొదటిసారని వివరించారు. తమ  అధీనంలోని 8 పోర్టులూ మొదటి ఆరు నెలల్లో అత్యధిక కార్గో వాల్యూమ్స్​ను హ్యాండిల్​ చేయడం విశేషమని కరణ్​ అదానీ చెప్పారు.