
న్యూఢిల్లీ : అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లాభం సెప్టెంబర్ 2023 క్వార్టర్లో 1.37 శాతం పెరిగి రూ. 1,761.63 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో కంపెనీ లాభం రూ. 1,737.81 కోట్లు. జులై– సెప్టెంబర్ 2023 క్వార్టర్లో ఆదాయం రూ. 6,951.86 కోట్లకు పెరిగినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. ఏడాది ప్రాతిపదికన ఇబిటా 49 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రూ. 12,894 కోట్ల రెవెన్యూ సాధించిన కంపెనీ మరో మైలురాయిని దాటిందని అదానీ పోర్ట్స్ సీఈఓ కరణ్ అదానీ చెప్పారు.
ఇక ఇబిటా రూ. 7,429 కోట్లకు ఎగసిందని, కార్గో వాల్యూమ్స్ కూడా 203 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయని పేర్కొన్నారు. ముంద్రా పోర్టు 25 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఒకే నెలలో 16 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండిల్ చేసిన ఘనతను ఈ పోర్టు దక్కించుకుందని వెల్లడించారు. దేశంలో ఏదైనా ఒక పోర్టు ఇంత కార్గో హ్యాండిల్ చేయడం ఇదే మొదటిసారని వివరించారు. తమ అధీనంలోని 8 పోర్టులూ మొదటి ఆరు నెలల్లో అత్యధిక కార్గో వాల్యూమ్స్ను హ్యాండిల్ చేయడం విశేషమని కరణ్ అదానీ చెప్పారు.