ఐదేళ్లలో రూ.1.73 లక్షల కోట్లు.. వివిధ రంగాల్లో పెట్టుబడి పెడతామన్న అదానీ

ఐదేళ్లలో రూ.1.73 లక్షల కోట్లు.. వివిధ రంగాల్లో పెట్టుబడి పెడతామన్న అదానీ
  • ఎఫ్​సీపీఏ కింద అభియోగాలు నమోదు కాలేదని వివరణ

న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్ళలో తమ వ్యాపారాలలో -20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.173 లక్షల కోట్ల) వరకు పెట్టుబడిని పెట్టాలని భావిస్తోందని అదానీ గ్రూప్ చైర్మన్​ గౌతమ్ అదానీ వెల్లడించారు. భారతదేశ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ డబ్బును ఇన్వెస్ట్​ చేస్తామని అన్నారు. మంగళవారం వర్చువల్​గా జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) గ్రూప్  భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక స్థితి, ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన మాట్లాడారు. తమ సంస్థకు బలమైన బ్యాలెన్స్​షీట్​, పటిష్టమైన వ్యాపారాలు ఉండటం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకోగలిగామని తెలిపారు.  పునరుత్పాదక ఇంధన సరఫరా ఒప్పందాలను గెలుచుకోవడానికి లంచం ఇచ్చినట్లు అమెరికా అధికారులు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్​సీపీఏ)ని ఉల్లంఘించినట్లు అదానీ గ్రూప్​లోని ఒక్కరిపైనా అభియోగాలు లేవని అదానీ స్పష్టం చేశారు.  

ఏజీఎం హైలైట్స్​: 

  • గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్​ ఆదాయాలు ఏడు శాతం పెరిగాయి.  ఇబిటా 8.2శాతం పెరిగింది.  నికర అప్పు-, ఇబిటా నిష్పత్తి 2.6 రెట్ల వద్ద  ఉంది.  మొత్తం ఆదాయం రూ. 2,71,664 కోట్లు కాగా,  సర్దుబాటు చేసిన ఇబిటా రూ. 89,806 కోట్లు ఉంది.
  • అదానీ పవర్ 100 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిని అధిగమించింది. 2030 నాటికి 31 గిగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుంది.  అదానీ గ్రీన్ గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ఖావ్‌‌‌‌‌‌‌‌దాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును నిర్మిస్తోంది, 2030 నాటికి 50 గిగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంమీద, 2030 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యం (థర్మల్, పునరుత్పాదక, పంప్డ్ హైడ్రో) లక్ష్యం.
  • అదానీ ఎనర్జీ సొల్యూషన్స్  రూ. 44 వేల కోట్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ ఆర్డర్లను పొందడమేగాక, రూ. 13,600 కోట్ల స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్టులను అమలు చేస్తోంది.  అదానీ న్యూ ఇండస్ట్రీస్ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 10 గిగావాట్ల సోలార్ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌ల కోసం ఎలక్ట్రోలైజర్స్​  ఫ్యాక్టరీలను నిర్మిస్తోంది.
  • అదానీ పోర్ట్స్ రికార్డు స్థాయిలో 450 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించింది. కంపెనీ రికార్డు స్థాయిలో 47 మిలియన్ టన్నుల బొగ్గు  ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 30శాతం పైగా వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
  • సిమెంట్ వ్యాపారం 100 మిలియన్ టన్నుల మైలురాయిని చేరుకుంది. 2027 ఆర్థిక సంవత్సరం-28 నాటికి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు రెట్టింపు చేయాలనే లక్ష్యంలో 72శాతం సాధించింది.
  • కంపెనీ నిర్వహిస్తున్న విమానాశ్రయాలు ఈ ఏడాది 9.4 కోట్ల మందికి సేవలు అందించాయి. నవీ ముంబై విమానాశ్రయం ఈ సంవత్సరం చివరిలో రెండు కోట్ల మంది ప్రయాణికుల ప్రారంభ సామర్థ్యంతో ప్రారంభమవుతుంది.