
న్యూఢిల్లీ: ఇండియాలో అత్యంత ధనవంతులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తాజాగా జత కట్టారు. ఒకరి ఫ్యూయల్ రిటైల్ నెట్వర్క్ను మరొకరు ఉపయోగించుకొని పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అమ్మేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఇది ఈ ఇద్దరు బిలియనీర్ ఇండస్ట్రియలిస్టుల మధ్య రెండో బిజినెస్ కొలాబరేషన్. అంబానీ యూకే కంపెనీ బీపీతో కలిసి ఏర్పాటు చేసిన జియో-బీపీ, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్)కు చెందిన సీఎన్జీ రిటైల్ ఔట్లెట్స్లో పెట్రోల్, డీజిల్ను అమ్ముతుంది.
అదే సమయంలో ఏటీజీల్, జియో-బీపీ పెంట్రోల్ బంకుల్లో సీఎన్జీ అమ్ముతుంది. ఈ ఒప్పందం కింద ప్రస్తుతం ఉన్న, భవిష్యత్లో ఏర్పాటయ్యే ఔట్లెట్స్ కవర్ అవుతాయి. జియో-బీపీ దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ పంప్స్ నడుపుతోంది. ఏటీజీఎల్ 650 జీఎన్జీ స్టేషన్స్ నిర్వహిస్తోంది. “ భారత కస్టమర్ల కోసం మరిన్ని ఆప్షన్లను అందుబాటులో ఉంచేందుకు అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్), జియో-బీపీ (రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ బ్రాండ్) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఏటీజీఎల్ బంకుల్లో జియో-బీపీకి చెందిన పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటాయి. జియో-బీపీ బంకుల్లో ఏటీజీఎల్కు చెందిన సీఎన్జీ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తారు” అని ఇరు కంపెనీలు ఓ స్టేట్మెంట్లో పేర్కొన్నాయి.
అంబానీ, అదానీ మధ్య ఇది రెండో భాగస్వామ్యం. గత ఏడాది మార్చిలో, మధ్యప్రదేశ్లో పవర్ ప్రాజెక్ట్ కోసం మొదటి సారిగా పార్టనర్షిప్ కుదుర్చుకున్నారు. అదానీ పవర్ ప్రాజెక్ట్లో 26 శాతం వాటాను రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే 500 మెగావాట్ల కరెంట్ను సొంత అవసరాలకు వాడుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఆయిల్ రిటైల్ మార్కెట్లో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ల ఆధిపత్యం కొనసాగుతోంది. దేశంలోని 97,366 పెట్రోల్ పంప్స్లో 90శాతం వీటి కంట్రోల్లోనే ఉంది. వంట గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇవే టాప్లో ఉన్నాయి. వీటిని అదానీ, అంబానీ కలిసి సవాల్ చేయనున్నాయి.