రైతులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

రైతులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

హైదరాబాద్: యూరియా కొరతతో ఇబ్బందులు పడుతోన్న రైతులకు భారీ గుడ్ న్యూస్. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో అదనంగా యూరియా కేటాయింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం (సెప్టెంబర్ 15) కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు- ఇప్పటికే కేటాయించిన 40 వేల టన్నులకు ఇది అదనం. 

తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని ఢిల్లీలోని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 15) తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను ఈ పది రోజుల్లో సరఫరా చేయాలని, వివిధ కారణాలతో యూరియా దిగుమతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి వివరించారు. 

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలకు యూరియా అత్యవసరమని.. ముఖ్యంగా ఈ పదిహేను రోజులు వ్యవసాయ సీజన్‌లో కీలకమైనవని అన్నారు. ఈ సమయంలో రైతులకు ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని.. అందువల్ల యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేలా చూడాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. 

అలాగే అంతకు ముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ  నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరామని చెప్పారు. అలాగే రానున్న 10 రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా.. ఈ వారంలో 80 వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తామని రజత్ కుమార్ మిశ్రా చెప్పారని వెల్లడించారు.

అందులో భాగంగానే సోమవారం (సెప్టెంబర్ 15) IPL, CIL, NBCL కంపెనీల నుంచి Rek Grace (2700 MT), GN Ruby (8100 MT), Grace Harmony (7800 MT), Endeavor (13000 MT), Wadi Albostan (8100 MT)  ఓడల ద్వారా 40 వేల మెట్రిక్ టన్నులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. ఈ కేటాయించిన యూరియా త్వరలోనే రాష్ట్రానికి చేరుకుంటుందని, దీంతో తెలంగాణ రైతుల యూరియా కష్టాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల.

 దీంతో సెప్టెంబర్ మొదటి 15 రోజులలోనే 1,04,000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా చేసినట్లు అవుతుందన్నారు. మిగతా మొత్తం కూడా పంపించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. దేశీయ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోయినా, దిగుమతుల ద్వారా తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.