కోస్గి వెలుగు: కోస్గి మండలంలోని మీర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంపై అడిషనల్ కలెక్టర్ శ్రీను అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. పాఠశాల వాతావరణానికి ఇబ్బంది కలగకుండా జూన్ 1లోపు ఈ కేంద్రాన్ని వెంటనే వేరే చోటుకు మార్చాలని మహిళా సమాఖ్య సభ్యులను ఆదేశించారు.
కేంద్రంలో గన్నీ బ్యాగులను భారీగా నిల్వ ఉంచడంపై మండిపడుతూ లారీలు అందుబాటులో ఉన్నా ధాన్యం తరలింపులో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. హమాలీల కొరత కారణంగానే లోడింగ్ ఆలస్యమవుతోందని నిర్వాహకులు వివరణ ఇవ్వగా, వర్షం వస్తే ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కోస్గి, గుండుమాల్ మండలాల్లోని పీఏసీఎస్ కేంద్రాలను తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.
