బీజేపీలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ విలీనం ఖాయం : ఆది శ్రీనివాస్

బీజేపీలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ విలీనం ఖాయం : ఆది శ్రీనివాస్
  • ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నడు: ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ విలీనం ఖాయమని, ఇందుకు ఎంపీ ఈటల రాజేందర్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని హరీశ్‌‌‌‌ రావు అమాయకంగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో ఆది శ్రీనివాస్‌‌‌‌ మాట్లాడారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే.. హరీశ్‌‌‌‌ మాత్రం పార్టీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారన్నారు. పొత్తుల గురించి పార్టీ ప్రెసిడెంట్ చెప్పాలే కానీ.. ఈ విషయం చెప్పడానికి హరీశ్‌‌‌‌ ఎవరని ప్రశ్నించారు. పొత్తుల గురించి హరీశ్‌‌‌‌ రావు మాట్లాడటం అంటే మభ్యపెట్టడమే అవుతుందన్నారు. పార్టీ ప్రెసిడెంట్ ఫాంహౌస్‌‌‌‌లో ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.

 హరీశ్‌‌‌‌ రావుకు దమ్ముంటే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కామెంట్లపై ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌ రావు స్పందించలేదని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కవితపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. మరోవైపు, రాజన్న ఆలయంలో కోడెల మరణంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు. అనారోగ్యం కారణంగా కొన్ని కోడెలు చనిపోయాయని ఆయన తెలిపారు. అనారోగ్యంగా ఉన్న కోడెలు, పాలు మరవని కోడెలను భక్తులు ఆలయానికి ఇవ్వొద్దని సూచించారు. రాజన్న ఆలయాన్ని మూసివేయడం లేదని, భీమేశ్వర ఆలయంలో అర్జిత సేవలుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.