
- ఆదివాసీ గ్రామాల్లో ఎస్పీ పర్యటన
ఆదిలాబాద్, వెలుగు: చదువు వల్లే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భీంపూర్ మండలంలోని కరంజీ, గుబిడి, భగవాన్పూర్, టెకిడి రాంపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. మారుమూల అటవీ ప్రాంతమైన భగవాన్పూర్ గ్రామానికి 7 కిలోమీటర్లు ఎస్పీ బైక్ నడుపుకుంటూ వెళ్లారు. ఆయా గ్రామాల ఆదివాసీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రజలకు అత్యంత చేరువై పోలీసు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ఉంటుందని, పిల్లలు ఒక్కరూ చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు చేయొద్దని, పండిస్తే కేసులో నమోదు చేస్తామని, ప్రభుత్వ పథకాలు రాకుండా జిల్లా యంత్రాంగానికి సిఫార్సు చేస్తామన్నారు. యువత క్రీడల్లోనూ రాణించాలన్నారు.
ఈ సందర్భంగా నాలుగు గ్రామాల్లో వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలపాలన్నారు. కార్యక్ర మంలో డీఏస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, భీంపూర్ ఎస్సై పీర్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.