ఆదిలాబాద్, వెలుగు: రిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఇప్పిస్తామని నమ్మించి రూ. 40 వేలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. భోరజ్ మండలం పూసాయి గ్రామానికి చెందిన తప్రే సంతోష్ 2018 నుంచి 2025 ఏప్రిల్ వరకు రిమ్స్లో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. ఈక్రమంలో తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి సిర్ర దేవేందర్, అబ్దుల్ ముజీబ్, డోంగ్రే చంద్రకాంత్ డబ్బులు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించక పోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
తక్కువ ధరకే వైద్యం పేరుతో..
ఆదిలాబాద్ పట్టణంలో తక్కువ ఖర్చుతో వైద్యం చేయిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన నిందితుడు షేక్ ఎజాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఔరంగాబాద్కు చెందిన ఎజాజ్ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో టెక్నీషియన్గా పని చేస్తున్నట్లు చెప్పేవాడు. ఈక్రమంలో తక్కువ ధరకే వైద్యం చేయిస్తానని నమ్మబలికి క్రాంతినగర్కు చెందిన షేక్ రిజ్వాన్ వద్ద రూ.60 వేలు తీసుకొని పరారయ్యాడు. సుభాష్ నగర్కు చెందిన ఫిరోజ్ ఖాన్ నుంచి రూ.27,500, ఆదిలాబాద్కు చెందిన ముస్తాక్ నుంచి రూ.27,500 వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ చెప్పారు.

