ఆదిలాబాద్​ కాంగ్రెస్​ టికెట్​ రేసులో ఆదివాసీ డాక్టర్​

ఆదిలాబాద్​ కాంగ్రెస్​ టికెట్​ రేసులో  ఆదివాసీ డాక్టర్​
  • సీఎం నుంచి పిలుపుతో హుటాహుటిన హైదరాబాద్​కు.. 
  • కాంగ్రెస్​ టికెట్​పై పోటీ చేసేందుకు సుముఖత
  • హస్తం పార్టీలో ఎంపీ సోయం బాపురావుకు మూసుకపోయిన దారులు

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేసులోకి అనూహ్యంగా ఆదివాసీ డాక్టర్  నైతం సుమలత పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ ​ నుంచి పిలుపు రావడంతో ఆదివారం ఆమె హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేని ఆమెకు హైకమాండ్​నుంచి పిలుపురావడం, ఏకంగా సీఎంను కలవడంతో ఆశవాహుల్లో ఆందోళన మొదలైంది. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్​ చేస్తారనే వార్తలు వెలువడుతున్న తరుణంలో కొత్త నేతల పేర్లు బయటకు వస్తుండడం ఆసక్తి రేపుతోంది.  

గోండు తెగకు చెందిన మొదటి మహిళా డాక్టర్​గా గుర్తింపు..

ఆదిలాబాద్​ రిమ్స్ లో ఎండీ ఫిజీషియన్ గా పని చేస్తున్న డాక్టర్ సుమలత గోండు తెగకు చెందిన మొదటి మహిళా డాక్టర్​గా గుర్తింపు పొందారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి తదితర ఏజెన్సీ గ్రామాల్లో  పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించారు.  సుమలత తాత మర్సుకోల కాశీరం గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసురాలిగా ఇప్పుడు రాజకీయ‍ అరంగేట్రం చేసేందుకు సుమలత సిద్ధమయ్యారు. సుమలత మొదట  బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. ఆ పార్టీ పెద్దలను కలిసి 
ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. బీఆర్​ఎస్​ నుంచి గొడం నగేశ్​ను బీజేపీలో జాయిన్ ​చేసుకొని టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలతో టచ్​లోకి వెళ్లారు. తాజాగా సుమలతకు సీఎం రేవంత్​రెడ్డి నుంచి పిలుపురావడం,  తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలివ్వడం ఆ పార్టీ శ్రేణులను విస్తుపోయేలా చేసింది.  

లంబాడానా.. ఆదివాసీనా..?

 లంబాడా, ఆదివాసీల్లో ఏ వర్గానికి  టికెట్ కేటాయించాలనే విషయంలో కాంగ్రెస్​ హైకమాండ్​ తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీ అభ్యర్థులకే టికెట్​ కేటాయించాయి.  ఇక మిగిలింది కాంగ్రెస్. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆదివాసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతుండగా, లంబాడా సామాజికవర్గంలో బలమైన అభ్యర్థి ఎవరైనా ఉన్నారా అనే విషయమై ఏఐసీసీ స్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసీలకు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ లంబాడ సామాజికవర్గానికి చెందిన రాథోడ్ రమేశ్​కు ఇచ్చింది . కానీ ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆదివాసీకే టికెట్ ఇవ్వాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్లు చెప్తున్నారు.  కానీ మిగిలిన ఇద్దరు ఆదివాసీలు కావడంతో లంబాడా 
సామాజికవర్గానికి టికెట్​ కేటాయిస్తే కలిసివచ్చే అవకాశముందని ఆ వర్గం నేతలు వాదిస్తున్నారు.  

సునీల్ కనుగోలు సర్వే..

ఆదిలాబాద్​ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ 22 మంది దరఖాస్తు చేసుకోగా, టికెట్ కేటాయింపులో సామాజిక సమీకరణాలతో పాటు సదరు అభ్యర్థి బలబలాలపై పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఆదిలాబాద్​లో సర్వే చేయించినట్లు సమాచారం. లీడర్లు మొదలు కార్యకర్తల దాకా వేలాది మంది అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ సర్వేలో మెజారిటీ శ్రేణులు ఆదివాసీలకే టికెట్​ కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ఆదివాసీల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ టీచర్​ ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్, ఆదివాసీ సేన అధ్యక్షుడు దౌలత్ రావు, తాజాగా తెరపైకి వచ్చిన రిమ్స్ డాక్టర్ సుమలత, లంబాడ వర్గం నుంచి ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, నరేశ్​ జాదవ్, శ్రావణ్ నాయక్, ఆడే గజేందర్, రాంకిషన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

సోయం బాపురావుకు నిరాశే!

బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎంపీ సోయం బాపురావుకు కాంగ్రెస్​లో సైతం దారులు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్న సోయం కాంగ్రెస్​లో చేరేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు సమాచారం. హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్​మెంట్​ కోసం  సోయం ప్రయత్నించారని, కానీ సీఎం టైం ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని ఎంపీ సన్నిహితులు అంటున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్​లోనే మకాం వేసిన సోయం బాపురావు పార్టీ మార్పుపై పునరాలోచనలో పడ్డారని, తిరిగి రాష్ట్ర బీజేపీ నేతలతోనే టచ్ లోకి వెళ్లారని చెప్తున్నారు.