హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ బెయిల్రద్దు పిటిషన్పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. రాహిల్ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మరణించింది. కారు ప్రమాదానికి కారణమైన ముగ్గురు పారిపోయారు.
కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉంది. ఈ ప్రమాదానికి తానే కారణమంటూ గతంలో ఓ వ్యక్తి లొంగిపోయాడు. ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ రాహిల్ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిలు పొందారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పోలీసులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ముందు మరో వ్యక్తి లొంగిపోయేలా చేసి రాహిల్ తప్పించుకున్నారని పోలీసులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు విచారణను రాహిల్ ఎదుర్కొంటున్నారు.