- సనత్నగర్లో కల్తీ కేంద్రం గుట్టురట్టు
- ఒకరు అరెస్ట్, 120 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం
జూబ్లీహిల్స్, వెలుగు: ప్రాణాంతక రసాయనాలతో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్నగర్ పరిధిలోని ఫతేనగర్కు చెందిన జగన్నాథ్ బిష్ణోయ్(33) తన ఇంట్లో కల్తీ టీ పొడి తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్, సనత్నగర్ పోలీసులు కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్చేసి విచారించగా, షాకింగ్విషయాలు బయటపడ్డాయి.
నిందితుడు అతితక్కువ ధరకు కొబ్బరి పీచు పొడిని సేకరించి, దాన్ని బెల్లం నీటిలో నానబెట్టి ఎండబెడుతున్నాడు. మూడ్రోజుల తర్వాత ఆ మిశ్రమానికి ‘సన్సెట్ ఎల్లో’, ‘టార్ట్రాజైన్ ఆరెంజ్’ వంటి హానికరమైన సింథటిక్ రంగులు కలిపి అసలైన టీ పొడిలా మార్చి స్థానిక టీ స్టాళ్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
ఈ తనిఖీల్లో 120 కిలోల కల్తీ టీ పొడి, 138 కిలోల కొబ్బరి పీచుతోపాటు గ్యాస్ సిలిండర్, బెల్లం బాక్సులు, వెయింగ్ మెషిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సీఐ దేవేందర్ హెచ్చరించారు.
