- డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ లక్ష్యంగా పాక్ ఎయిర్ స్ట్రైక్ చేసిందన్న అఫ్గానిస్తాన్
- 250 మందికి తీవ్ర గాయాలు
- డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ లక్ష్యంగా పాక్ ఎయిర్ స్ట్రైక్
- ఆస్పత్రిపై దాడి అమానుషమని అఫ్గానిస్తాన్ ఫైర్
- తాము దవాఖానను టార్గెట్ చేయలేదన్న పాక్
- ఉగ్రవాద, సైనిక స్థావరాలే లక్ష్యంగా అటాక్ చేసినట్టు వెల్లడి
- ఇది పిరికిపంద చర్య.. క్షమించరాని నేరం: భారత్
కాబూల్/ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ విరుచుకుపడింది. నగరంలోని ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ బాంబు దాడుల్లో 400 మంది మరణించగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్గాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ వెల్లడించారు. ‘‘మత్తు పదార్థాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్న కాబుల్లోని 2వేల పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిపై రాత్రి 9 గంటల సమయంలో పాక్ దాడి చేసింది. ఆ భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆసుపత్రి పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటివరకూ 400 మంది చనిపోగా, 250 మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఉన్న డెడ్బాడీలను రెస్క్యూ టీం వెలికితీస్తున్నది” అని వెల్లడించారు.
నిస్సహాయులైన రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిపై దాడి చేయడం అమానుషమని, ఇది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనే అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనతో అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. యూఎన్ఓ సహా అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పిరికిపంద చర్య
కాబూల్లోని ఆసుపత్రిపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదొక అమానవీయ, పిరికిపంద చర్య అని మండిపడింది. డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్పై పాక్ జరిపిన దాడుల్లో సుమారు 400 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘కాబూల్లోని ‘ఓమిడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్’పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది క్షమించరాని నేరం.
సైనిక లక్ష్యం ఏమాత్రం లేని చోట.. సామాన్య పౌరులు ఉన్న ఆసుపత్రిపై దాడి చేయడం అత్యంత దారుణం.. ఇది అఫ్గనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని కాలరాయడమే కాకుండా, ప్రాంతీయ శాంతికి ముప్పు” అని పేర్కొన్నది. శాంతిని కోరుకునే పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి మారణకాండకు పాల్పడడం పాక్ నైతిక పతనాన్ని సూచిస్తుందని విమర్శించింది. ఈ నేరానికి పాల్పడిన వారిని బాధ్యులను చేయాలని, అఫ్గాన్ పౌరులపై పాక్ జరుపుతున్న దాడులను వెంటనే అరికట్టాలని ప్రపంచ దేశాలను భారత్ కోరింది. ఈ విషాద సమయంలో అఫ్గానిస్తాన్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అఫ్గాన్ ప్రాంతీయ సమగ్రతకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపింది.
ఖండించిన పాక్..
ఆసుపత్రిపై దాడిచేసినట్టు అఫ్గానిస్తాన్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ ఖండించింది. తాము ఆసుపత్రిపై దాడి చేయలేదని, సోమవారం రాత్రి కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేశామని వెల్లడించింది. అఫ్గాన్ చేస్తున్నవి తప్పుడు, తప్పుదోవ పట్టించే ఆరోపణలని కొట్టిపారేసింది. పౌరులు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు పాక్ వెల్లడించింది.
