ప్రతి మనిషికి ఆరోగ్యం చాలా అవసరం. పూర్వ కాలంలో డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలనుకొనేవారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రతి ఒక్కరు ఆహార విషయాల్లో కొన్ని నియమాలు పాటించాలి. ఏది ఎప్పుడు తినాలి అనే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలంటే తిన్న తరువాత కొన్ని నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం . . !
- ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నిత్యం మనం కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందులో భోజనం చేశాక కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.
- భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది.
- అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
- తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
- భోజనం అయ్యాక పదినిమిషాలు పాటు నడిస్తే మంచిది అంటారు. కానీ అలా నడవటం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా, ఓ పదినిమిషాల తర్వాత నడిస్తే మంచిది.
- అన్నింటికంటే ముఖ్యంగా తినగానే నిద్ర పోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.
