బంగారం పేరుతో మోసం.. అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు

బంగారం పేరుతో మోసం.. అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు
  • రూ. 40 లక్షల స్వాధీనం.. పరారీలో మరో ఇద్దరు

అంబర్‌‌‌‌పేట, వెలుగు: తక్కువ ధరకు బంగారం పేరుతో మోసగిస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్‌‌‌‌పేట ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ బి. బాలస్వామి వివరాలు వెల్లడించారు. కర్ణాటక స్టేట్, రాయచూరు జిల్లా మాన్వి గ్రామానికి చెందిన జయకుమార్, అదే రాష్ట్రం ముద్గాల్ గ్రామానికి చెందిన ఉదయ్ రెడ్డి, సందీప్ అలియాస్ రఘు ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. 2025 మార్చి 30న చౌటుప్పల్ కు చెందిన రియల్టర్ మునుకుంట్ల నిరంజన్ కు వీరిలో ఒక సభ్యుడు ఫోన్ చేశాడు.  తక్కువ ధరకే మా వద్ద బంగారం ఉందని నమ్మబలికాడు. కంటిన్యూగా ఫోన్ చేస్తూ నమ్మించాడు.  

దీన్ని నమ్మిన నిరంజన్ ఈనెల12న తన స్నేహితుడు ధర్మేందర్‌‌‌‌ను తీసుకొని కారులో  రూ.65 లక్షలతో బయలుదేరారు. నగరంలోని చాదర్ ఘాట్ వద్దకు రమ్మన్నారు. తర్వాత మళ్లీ పూత్ బౌలి ఇరానీ చాయ్ హోటల్ దగ్గరికి రమ్మన్నారు. నిరంజన్ ధర్మేందర్ ఇద్దరూ కారులో అక్కడికి వచ్చి బ్యాగులో ఉన్న రూ. 65 లక్షలు వారికి అందించారు. వారి చేతిలో ఉన్న బ్యాగును వీళ్లు తీసుకున్నారు. బ్యాగులు ఇచ్చిన వెంటనే ముగ్గురు నెంబర్ ప్లేట్ లేని బైక్ లపై పరారయ్యారు. నిరంజన్ బ్యాగు తెరిచి చూడగా అందులో చీరలు, రాళ్లు కనిపించాయి.  షాక్ కు గురైన వీరు వెంటనే అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలు సేకరించారు. ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు జయకుమార్ ను అరెస్టు చేశారు. ఒక కారు, రూ. 45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు ఉదయ్, సందీప్ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న అప్జల్ గంజ్ ఇన్ స్పెక్టర్ రవి, క్రైం సిబ్బందిని అభినందించారు.