న్యూఢిల్లీ: పాలస్తీనా టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్.. ఇజ్రాయెల్పై దాడి వెనుక అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందమే పరోక్ష కారణమనే చర్చ జరుగుతోంది. ఖైదీలను ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు దేశాల నడుమ జరిగిన 6 బిలియన్ డాలర్ల(రూ.49 వేల కోట్లు) డీల్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ డీల్పై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సెప్టెంబర్లోనే సంతకాలు చేశారు. అందుకు ఇరాన్ చేతిలో బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్ల విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నారు. అయితే, ఆరు బిలియన్ డాలర్లతోనే ఇజ్రాయెల్పై దాడికి హమాస్ను ఇరాన్ ప్రోత్సహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అసలెక్కడివీ నిధులు?
2019లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చమురు ఎగుమతులు, బ్యాంకింగ్ రంగంపై ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ చమురు ఆదాయాలు 6 బిలియన్ డాలర్లు కొరియన్ బ్యాంకుల్లో చిక్కుకుపోయాయి. అవి అప్పటినుంచి అలాగే ఉండిపోయాయి. ఈ ఆరు బిలియన్ల కోసం ఇరాన్ అమెరికా మధ్య ఇటీవలే కీలక ఒప్పందం జరిగింది. ఈ ఫండ్స్ను క్లియర్ చేయాలంటే ఇరాన్ జైళులో ఉన్న ఐదుగురు అమెరికన్లను విడుదల చేయాలని బైడెన్ డిమాండ్ చేశారు.
అందుకు, అమెరికా ఆధీనంలో ఉన్న ఐదుగురు ఇరానియన్ ఖైదీలను కూడా విడిచిపెట్టాలని ఇరాన్ కండిషన్ పెట్టింది. దీనికి ఇరు దేశాలు ఓకే చెప్పుకోగా డీల్పై సెప్టెంబర్లో బైడెన్ సంతకం చేశారు. అయితే, ఇంతకాలం స్తబ్దుగా ఉన్న నిధులను ఇరాన్కు విడుదల చేయడం ద్వారా బైడెన్ పరోక్షంగా హమాస్కు మద్దతు ఇచ్చినట్లయిందని యూఎస్ రిపబ్లికన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ నిధులను హమాస్ టెర్రరిస్టులకు ఇరాన్ అందజేసిందని ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఆ నిధులు ఇప్పటికీ.. డీల్కు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ హాండోవర్లోనే ఉన్నాయని అంటున్నారు.