లక్షలు పెట్టి కొన్నరు.. మూలకు పడేసిన్రు

లక్షలు పెట్టి కొన్నరు.. మూలకు పడేసిన్రు
  •  వృథాగా రూ.50 లక్షల విలువైన అగ్రి మెషీన్లు
  • రూర్బన్​స్కీం కింద 2020 జూలైలోనే పాపన్నపేటకు చేరిన మెషీన్లు
  • తుప్పు పడుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు

మెదక్ ​జిల్లా పాపన్నపేట మండలంలో రూర్బన్​ స్కీం కింద కొనుగోలు చేసిన సాగు యంత్రాలు వృథాగా ఉన్నాయి.  రెండేండ్లు కావస్తున్నా ఆ మెషీన్లను వినియోగించకపోవడంతో తుప్పుపట్టి పోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి కొన్న యంత్రాలు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పాడవుతున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాడుకలోకి తేవాలని కోరుతున్నారు. 

మెదక్​, పాపన్నపేట, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్య, వ్యవసాయరంగాల్లో సదుపాయాలు మెరుగు పర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం శ్యాంప్రసాద్​ ముఖర్జీ రూర్బన్​ మిషన్​పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో ఎంపిక​ చేసిన క్లస్టర్లలో ఈ స్కీంను అమలు చేస్తుండగా, రూర్బన్​ మూడో ఫేజ్​లో మెదక్ జిల్లా పాపన్నపేట మండలాన్ని సెలక్ట్​ చేశారు. ఈ స్కీం కింద మండలానికి మొత్తం రూ.30  కోట్లు శాంక్షన్ ​అయ్యాయి. పాపన్నపేట మండలంలోని  రైతుల అవసరాలకు వివిధ వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో  మూడు వరినాటే యంత్రాలు, నాలుగు విత్తనాలు, ఎరువులు వేసే యంత్రాలు, రెండు మక్కల నూర్పిడి యంత్రాలు, నాలుగు గడ్డి కట్టే యంత్రాలు, ఒక ట్రాక్టర్​, 8 గడ్డి కోసే మెషీన్లు, 10 తైవాన్​  స్ప్రేయర్​లు కొనుగోలు చేశారు. ఇవి 2020 జులైలోనే పాపన్నపేటకు చేరాయి.  

కస్టమర్​సెంటర్​ఏర్పాటు చేయలే..

రూర్బన్​ స్కీం కింద కొనుగోలు చేసిన వ్యవసాయ యంత్రాల మెయింటెనెన్స్​ కోసం అగ్రికల్చర్​ ఆఫీసర్లు, జిల్లా రైతు సమన్వయ కమిటీ కలిసి 11 మందితో ఒక కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో కస్టమర్​ సెంటర్​ ఏర్పాటు చేసి, అవసరం ఉన్న రైతులకు యంత్రాలను కిరాయికి ఇవ్వాలి. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని యంత్రాల మెయింటెనెన్స్​కు, సిబ్బంది జీతాలకు ఉపయోగించాలి. కాగా యంత్రాలు కొనుగోలు చేసి, కమిటీ ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడిచినా ఇంత వరకు  కస్టమర్​సెంటర్​ఏర్పాటు చేయలేదు.

ప్రారంభంలో ట్రాక్టర్​ తోపాటు, రెండు, మూడు యంత్రాలను కొందరు రైతులకు కిరాయికి ఇచ్చారు. కానీ మిగతా యంత్రాల గురించి పట్టించుకోలేదు.  ప్రస్తుతం ఆ యంత్రాలు పాపన్నపేటలోని ఓ ఫంక్షన్​ హాల్ లో వృథాగా పడి ఉన్నాయి. 2020 వానాకాలం సీజన్​లో  తెచ్చిన యంత్రాలు 2022 ఖరీఫ్​ సీజన్​ మొదలైనా ఇంతవరకు ఆ యంత్రాలను వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుపట్టి పోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు స్పందించి వెంటనే ఆ మెషీన్లను వాడుకలోకి తేవాలని పలువురు రైతులు కోరుతున్నారు.