ఓఆర్ఆర్ ఇక సేఫ్!.. 24 గంటలూ ఏఐతో పర్యవేక్షణ ..ప్రమాదాల నివారణకు మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్

ఓఆర్ఆర్ ఇక సేఫ్!..  24 గంటలూ  ఏఐతో పర్యవేక్షణ ..ప్రమాదాల నివారణకు మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్
  • 14 లొకేషన్లలో కెమెరాలు
  • రాంగ్​వే డ్రైవింగ్, లేన్​ వయలేషన్, రాంగ్​పార్కింగ్ గుర్తింపు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔటర్​ రింగ్​ రోడ్​పై ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోంది. హైస్పీడ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఓఆర్ఆర్​పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు తేలడంతో నివారణ చర్యలు ప్రారంభించింది. ఒక్కో లేన్​పై ఒక్కో వేగంతో వెళ్లడానిక అవకాశం ఉన్నా ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేయడం, అనుమతి లేకున్నా వాహనాల పార్కింగ్​తో యాక్సిడెంట్లు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. 

దీని నివారణకు హైదరాబాద్​గ్రోత్​కారిడార్ లిమిటెడ్​(హెచ్​జీసీసీ), సైబరాబాద్​పోలీసులు సంయుక్తంగా 24 గంటలపాటు నిఘా ఉంచేందుకు ఏఐ ఆధారిత మల్టీ వయలేషన్​డిటెక్షన్​సిస్టమ్​అమలు చేయనున్నారు. ఇందులోని ఎలక్ట్రానిక్​మానిటరింగ్​అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​సిస్టమ్​(ఈఎంఈఎస్​) విధానం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని, అలాగే దానికి కారకులను సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుందంటున్నారు.  

14 లొకేషన్లలో..

ఓఆర్ఆర్​పరిధి158 కి.మీ మేరకు విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు 25 ఎగ్జిట్​పాయింట్లున్నాయి. ఈ మేరకు ఓఆర్ఆర్​పొడవునా14 ముఖ్యమైన లొకేషన్లలో సింగిల్​ కెమెరా టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 24 గంటల పాటు వాహనాల రాకపోకలను, డ్రైవర్ల డ్రైవింగ్​తీరును గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వాహనాల డ్రైవర్లు నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది కూడా ఈ కెమెరాల ద్వారా స్పష్టంగా తెలుస్తుందంటున్నారు. 

ముఖ్యంగా వాహనాల స్లో, స్పీడ్ మూవ్​మెంట్​​(డే అండ్​నైట్) ను స్పష్టంగా గుర్తించడానికి వీలుంటుంది. రాంగ్​వే డ్రైవింగ్, లేన్​డిసిప్లిన్​వయలేషన్, రివర్స్​డ్రైవింగ్​, సీట్​బెల్ట్​ పెట్టుకోకపోవడం, మొబైల్​ఫోన్​ ఉపయోగించడం, పార్కింగ్​చేయడం వంటివన్నీ నేరుగా మానిటర్​చేసేందుకు అవకాశం ఉంటుంది. 

ఓఆర్ఆర్​పై 14 ప్రాంతాల్లో ఈ సిస్టమ్​ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్​కమిషనరేట్​నుంచి హెచ్ఎండీఏకు (హెచ్​జీసీసీ)కి ప్రతిపాదనలు అందాయి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సర్వేలెన్స్​ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిబంధనలు పాటించని వాహన దారులకు ఛలానాలు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 

రూ. 8.34 కోట్లతో ప్రతిపాదనలు

సైబరాబాద్​పోలీసులు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన హెచ్ఎండీఏ ఈ ప్రాజెక్టు నిర్వహణను ప్రైవేట్​ఏజెన్సీ ద్వారా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్ట్​డిజైన్, మెయింటెన్స్​పై సదరు సంస్థ డీపీఆర్​అందించనుంది. 

సైబరాబాద్​ పరిధిలో 0 నుంచి 23.78 కి.మీ. 43 కి.మీ. నుంచి 72 కి.మీ, 121 కి.మీ. నుంచి158.16 కి.మీగా ప్రాజెక్టును విభజించి ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.8.34 కోట్లు ఖర్చవుతాయని అంచనా  వేస్తున్నారు. 

ఎలా పని చేస్తుందటే..

ఈ ప్రాజెక్టులో వినియోగించే కెమెరాలతో ఆటోమేటిక్​నెంబర్​ప్లేట్​రికగ్నిషన్, మోడల్, క్లాసిఫికేషన్​ను ప్రత్యేక సాఫ్ట్​వేర్ ద్వారా గుర్తించి ఈ–చలానాలు వేసేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మొత్తం ప్రాసెస్​ను ఇంటిగ్రేటెడ్​కంట్రోల్​​ రూమ్​ద్వారా పర్యవేక్షించనున్నారు. 

ఈ టెక్నాలజీ ద్వారా ఏ ప్రాంతంలో అనధికార పార్కింగ్​ఉన్నా అలర్ట్​ చేసి పెట్రోలింగ్​టీమ్​కు సందేశం పంపుతుందంటున్నారు. వాహనా స్లో మూవ్​మెంట్​గుర్తించి చెప్తుందని, ప్రమాదాలు జరిగితే అంబులెన్స్​లను అలర్ట్​ చేసే టెక్నాలజీ కలిగి ఉంటుందంటున్నారు. 

అన్ని సీసీకెమెరాలు సమాచారాన్ని ఎప్పటికప్పుడు నానక్​రామ్​గూడలో నిర్మించే మాస్టర్​ట్రాఫిక్​కంట్రోల్ సెంటర్​(ఎంటీసీసీ)కి బంజారాహిల్స్​లోని కమాండ్​కంట్రోల్​సెంటర్​(సీసీసీ)కి అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి త్వరలోనే బిడ్డర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాచకొండ కమిషరేట్​పరిధిలోని ఓఆర్ఆర్​లొకేషన్లలో కూడా అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.