సెక్రటేరియెట్​లో .. రూ.300 కోట్ల స్కామ్​

సెక్రటేరియెట్​లో .. రూ.300 కోట్ల స్కామ్​
  • రూ. 20 కోట్ల ఇంటర్నెట్​ పరికరాలను రూ.300 కోట్లకు కొన్నరు
  • కేటీఆర్​ సూచనలతోనే జయేశ్ రంజన్ ముందుండి నడిపించిండు
  • ఈడీకి కాంగ్రెస్​ నేత  బక్క జడ్సన్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్​లో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్​ నేత, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్​ ఆరోపించారు. సచివాలయంలో ఐటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్ట్​కు సంబంధించి స్విచ్చులు, నెట్​వర్క్​ సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో ఈ స్కామ్​ జరిగిందన్నారు. రూ.20 కోట్ల విలువైన పరికరాలను రూ.300 కోట్లకు కొనుగోలు చేశారన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేశ్​ రంజన్​కు ఈ స్కామ్​లో డైరెక్ట్​గా సంబంధం ఉందన్నారు. 

కేటీఆర్​ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందన్నారు. తెలంగాణ స్టేట్​ టెక్నాలజీ సర్వీసెస్​ (టీఎస్​టీఎస్​), ఐటీఈ అండ్​ సీ (ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్​) డిపార్ట్​మెంట్లు కుంభకోణాలకు మారుపేరుగా తయారయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు శాఖల్లో జాయింట్​ డైరెక్టర్లను కాదని జూనియర్​ అధికారులే పరికరాల కొనుగోలులో కీలకంగా వ్యవహరించారన్నారు. గ్లోబల్​ టెండర్లు పిలవాలన్న సీవీసీ గైడ్​లైన్స్​కు విరుద్ధంగా టెండర్లు పిలిచారని, పెద్ద కంపెనీలను రానివ్వకుండా, ఇన్ఫినెట్​ కంప్యూటర్​ సొల్యూషన్​ అనే చిన్న సంస్థకు ఇచ్చారని మండిపడ్డారు. హెల్త్​ డిపార్ట్​మెంట్​లో భారీ కుంభకోణానికి పాల్పడిన వెంకటేశ్వర్​రావు, హెచ్.రావు, రాజేందర్​, సత్య అనే అధికారులు నెట్​ పరికరాల కొనుగోలులో కీలకపాత్ర పోషించారన్నారు. కాబట్టి, కేటీఆర్ ​సహా వీళ్లందరిపై చర్యలు తీస్కోవాలని ఫిర్యాదులో కోరారు.