దళితులంతా కాంగ్రెస్​కు అండగా ఉండాలి: రాజేశ్ లిలోతియా

దళితులంతా కాంగ్రెస్​కు అండగా ఉండాలి: రాజేశ్ లిలోతియా

ఏఐసీసీ ఎస్సీ సెల్​ చైర్మన్​ రాజేశ్​ లిలోతియా విజ్ఞప్తి


హైదరాబాద్, వెలుగు: దళితులు కాంగ్రెస్​ పార్టీకి అండగా ఉండాలని ఏఐసీసీ ఎస్సీ సెల్​ చైర్మన్​ రాజేశ్​ లిలోతియా విజ్ఞప్తి చేశారు. త్వరలోనే దళిత విద్యార్థులు, మేధావులతో సమావేశమవుతామని, వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్​ స్థానాల్లోనూ దళితులకు టికెట్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మంగళవారం గాంధీభవన్​లో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పీసీసీ ఎస్సీ సెల్​ చైర్మన్​ ప్రీతమ్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో లిలోతియా చీఫ్ ​గెస్ట్​గా మాట్లాడారు. 

ఎస్సీ సెల్​లోని సీనియర్​ నాయకులకు పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. బుధవారం లీడర్​షిప్​ డెవలప్​మెంట్​ మిషన్​ కో ఆర్డినేటర్లతో రిజర్వ్​డ్​ నియోజకవర్గాల పనితీరుపై లిలోతియా చర్చించనున్నారు. అనంతరం గద్దర్​ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఈ సమావేశంలో మహేశ్​ కుమార్​ గౌడ్, మల్లు రవి, పార్టీ వైస్​ ప్రెసిడెంట్​ హర్కర వేణుగోపాల్​ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నంది ఎల్లయ్య, గద్దర్​కు నివాళులర్పించారు.