ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ ను నిర్వహించింది. ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్ లో దాదాపు 500 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కామినేని హాస్పిటల్స్ అవగాహన కల్పించి ఎయిడ్స్ ను అరికడదాం అనే నినాదానికి పిలుపునిచ్చింది. కామినేని హాస్పిటల్ లోని హెచ్ఓడి & కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ స్వామి ఎయిడ్స్ అవగాహన నడకను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్స్ కు చెందిన హెచ్ఓడి & కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ స్వామి మాట్లాడుతూ... ప్రపంచంలో మూడవ అతిపెద్ద హెచ్ఐవీ అంటువ్యాధిని కలిగిన దేశంగా భారతదేశం ఉందన్నారు. అవగాహనతోనే ఎయిడ్స్ ను దరిచేరనీయవచ్చని, ప్రజల్లో అవగాహనను చాలా ప్రభావవంతంగా వ్యాప్తి చేయడంలో యువ తరం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.