హైదరాబాద్, వెలుగు: రాజకీయంగా అణచివేతకు గురైన వారికి, ఉద్యమ నేపథ్యం ఉన్నవారికి తాము సీట్లు ఇస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, ఈసారి కూడా అంతకు మించి రిజల్ట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
సీఎం కేసీఆర్ తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేతో సహా పలువురు ప్రజాప్రతినిధులను కొనుక్కున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన ‘వీ6 వెలుగు’తో మాట్లాడారు. రెండ్రోజుల క్రితం తీన్మార్ మల్లన్న తమను కలిశారని చెప్పారు. మేడ్చల్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నందునా తనకు మద్దతివ్వాలని, ఏఐఎఫ్బీ తరఫున క్యాండిడేట్ ను నిలబెట్టవద్దని మల్లన్న కోరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేయాలని తాము కూడా తీన్మార్ మల్లన్నకు సూచించినట్లు సురేందర్ రెడ్డి వివరించారు.
దీనిపై మల్లన్న స్పందిస్తూ.. ఏఐఎఫ్బీ ఆఫర్ పై తన టీమ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలామంది సంప్రదించారని చెప్పిన సురేందర్ రెడ్డి..అర్హులకు సీట్లను కేటాయిస్తామన్నారు. ఈ సారి పార్టీ విస్తరణపై దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు.