- 9 ప్రాంతాల్లో 400 దాటిన ఏక్యూఐ
- రెడ్ జోన్లోని పలు ప్రాంతాలు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ మరోసారి ‘గ్యాస్ చాంబర్’గా మారింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ –-ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. దీంతో అలీపూర్, బవానా, బురారీ క్రాసింగ్, ఐటీఓ, జహంగీర్ పురి, నరేలా, నెహ్రూ నగర్, వివేక్ విహార్, వజీర్పూర్, రోహిణి, ఆర్కేపురం, ద్వారాక వంటి 9కి పైగా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 పాయింట్లు దాటింది. పలు ప్రాంతాలను రెడ్ జోన్లో చేర్చారు. క్రమంగా పడిపోతోన్న ఉష్ణోగ్రతలు వాయు కాలుష్యానికి కారకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (డీఆర్ఏపీ) మూడో దశను అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఢిల్లీలో గాలి పీల్చడం అత్యంత హానికరంగా మారింది. పర్యావరణ డేటా ప్రకారం.. రోజుకు ఒకటి కంటే ఎక్కువ సిగరేట్లు కాల్చడంతో సమానమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. చాలా తక్కువ ఏక్యూఐ నమోదైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోజుకు 6 నుంచి 10 సిగరెట్లు తాగినంత హానికరమైన గాలిని పీల్చుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. 400కు పైగా ఏక్యూఐ నమోదైన ఏరియాలో ఉన్న వారు ఏకంగా 16 నుంచి 20 సిగరెట్లు తాగిన వారితో సమానం అని చెబుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక ఎన్సీఆర్ పరిధిలో శనివారం పెద్ద సంఖ్యలో శ్వాస సంబంధిత సమస్యతో హాస్పిటల్స్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్లు తెలిపారు.
