మేమంతా ఇండియన్ ముస్లింలం
ఎక్కడ పుట్టామంటే ఎట్ల చెప్పేది : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
కాగజ్నగర్, బెల్లంపల్లి, వెలుగు: భారతదేశంలో మత ప్రాతిపదికన చట్టాలు చేస్తూ హిందూ దేశంగా మార్చాలని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తోందని ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్అమలైతే దేశంలోని ముస్లిం, మైనార్టీలు, పేదలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తెలిపారు. కొమ్రం భీం జిల్లా కాగజ్నగర్, బెల్లంపల్లి లో గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని ముస్లింలంతా ఇండియన్ ముస్లింలేనని స్పష్టం చేశారు. దేశంలో ఆందోళనలను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా గుర్తించకుండా తామే రైటన్నట్లు ముందుకు వెళ్లడం సరికాదన్నారు. ఎన్నార్సీ అమలైతే ముస్లిం అంటే గిట్టని ఆఫీసర్లు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని దుస్థితి ఉంటుందని అన్నారు. దేశంలో కనీసం 40 శాతం మంది ముస్లింల వద్ద బర్త్సర్టిఫికెట్లు లేవని తెలిపారు. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే తమ పనితీరు చూపిస్తామన్నారు.