విమాన ప్రమాదం ఎఫెక్ట్.. 20 శాతం తగ్గిన ఎయిర్ ఇండియా బుకింగ్స్

విమాన ప్రమాదం ఎఫెక్ట్.. 20 శాతం తగ్గిన ఎయిర్ ఇండియా బుకింగ్స్

న్యూఢిల్లీ:   బోయింగ్ 787-8 డ్రీమ్‌‌‌‌‌‌‌‌లైనర్ విమానం గతవారం కుప్పకూలిన తర్వాత ఎయిర్ ఇండియా విమానాల బుకింగ్‌‌‌‌‌‌‌‌లు దేశీయ,  అంతర్జాతీయ మార్గాల్లో దాదాపు 20 శాతం తగ్గాయి. దీనికితోడు సగటు చార్జీలు 8-–15 శాతం పడిపోయాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీఓ) అధ్యక్షుడు రవి గోసైన్ శుక్రవారం (June 20) తెలిపారు. ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందించలేదు. 

242 మంది ప్రయాణికులు,  సిబ్బందితో లండన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం, ఏఐ-171 జూన్ 12న అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో కూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నగరంలోని మేఘనినగర్ ప్రాంతంలోని మెడికల్ ​హాస్టల్​ను ​ఢీకొట్టడంతో ఒకరు మినహా విమానంలోని అందరూ మరణించారు. "ఎయిర్ ఇండియా దురదృష్టకర ఘటన తర్వాత, ముఖ్యంగా అంతర్జాతీయ రంగాలలో బుకింగ్‌‌‌‌‌‌‌‌లలో తాత్కాలిక తగ్గుదల కనిపిస్తోంది. ఇది రూట్‌‌‌‌‌‌‌‌ను బట్టి మారుతోంది. అంతర్జాతీయ బుకింగ్‌‌‌‌‌‌‌‌లలో దాదాపు 18–22 శాతం తగ్గుదలను గమనించాం. దేశీయంగా బుకింగ్స్​10–12 శాతం తగ్గాయి. ఈ పరిస్థితి కొంతకాలమే ఉండవచ్చు. 

ప్రయాణికుల్లో నమ్మకం క్రమంగా పెరుగుతుంది " అని గోసైన్ చెప్పారు. కీలకమైన ఎయిర్ ఇండియా మార్గాల్లో చార్జీలలో కొంత తగ్గుదల ఉందని వెల్లడించారు. "ఇండిగో,  అకాసా వంటి బడ్జెట్​ క్యారియర్‌‌‌‌‌‌‌‌లతో ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ నేరుగా పోటీపడే దేశీయ సెక్టార్లలో టిక్కెట్ల ధరలు 8–12 శాతం తగ్గాయి. అంతర్జాతీయ మార్గాలలో, ముఖ్యంగా యూరప్ , ఆగ్నేయాసియాకు రూట్, ఆక్యుపెన్సీ,  పోటీని బట్టి చార్జీలు 10–15 శాతం తగ్గాయి. ప్రమోషన్లు, డిమాండ్​పడిపోవడం ఇందుకు కారణాలు”అని ఆయన వివరించారు. 

క్యాన్సిలేషన్లూ ఎక్కువే..

టూర్ ఆపరేటర్ల ద్వారా బుక్ చేసుకున్న ఎయిర్ ఇండియా విమానాల టికెట్లను ప్రయాణికులు రద్దు చేసుకున్నారా అన్న ప్రశ్నకు ‘అవును’ అని బదులిచ్చారు. క్యాన్సిలేషన్లు భారీగా ఉన్నాయని, ముఖ్యంగా కార్పొరేట్,  హై-ఎండ్ లీజర్​ ప్యాసింజర్లు ఇతర కంపెనీల విమానాల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. గత వారంలో క్యాన్సిలేషన్లలో పెరుగుదల అంతర్జాతీయంగా 15–18 శాతం, దేశీయంగా 8–10 శాతం ఉందని గోసైన్​ తెలియజేశారు.  రాబోయే రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి రావొచ్చన్నారు. 

డీజీసీఏ వంటి సంస్థలు ఎయిర్ ఇండియా విమానాలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించడం ఎయిర్​ ఇండియాకు ఊరటను ఇచ్చింది. ఇండియన్ టూరిజం అండ్​ హాస్పిటాలిటీ అసోసియేషన్ల సమాఖ్య (ఫెయిత్) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా కూడా ఎయిర్ ఇండియా విమానాల బుకింగ్‌‌‌‌‌‌‌‌లలో 20 శాతం వరకు తగ్గుదల ఉందని చెప్పారు. 

ఇతర కంపెనీలతో అధిక పోటీ ఉన్న కొన్ని రంగాలలో చార్జీలు దాదాపు 10 శాతం తగ్గాయని వెల్లడించారు. క్రాష్ తర్వాత దేశీయ,  అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమానాలకు కొత్త బుకింగ్‌‌‌‌‌‌‌‌లలో 15-–20 శాతం తగ్గుదల ఉందని మెహ్రా అన్నారు.